|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 07:29 PM
దేశంలో ఉగ్రదాడి అలజడి రేపిన సమయంలో తెలంగాణలోని కొందరు ఉద్యోగుల తీరు ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఉద్యోగులు డబ్బు కోసం ఎంతకైనా తెగించి అంగట్లో సరుకుల్లా ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్లు జారీ చేసే స్థాయికి దిగజారడం దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలోని కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోంది. వ్యవస్థలోని అవినీతిని, బాధ్యతారాహిత్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి.
దేశంలో అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు బంగ్లాదేశీయులకు నకిలీ బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు జారీ చేసి వారు పాస్పోర్ట్ పొందేలా చేసిన ఘటనలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నార్సింగి మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి జి.సుధీర్ కుమార్ , మహ్మద్ ముఖీబ్, టి.సాయి కిరణ్, జి.రంజనీకాంత్ , బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ హసిబుల్, రోహన్ షాలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హసిబుల్ ఢాకా నుంచి నాలుగేళ్ల క్రితం రూ.25 వేలు చెల్లించి అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. కోల్కతాలో జోవన్ చౌదరి అనే నకిలీ పేరుతో ఆధార్ కార్డు పొందాడు. అక్కడ కరాటే కోచ్గా పనిచేస్తూ.. 2023లో మలక్పేట్కు చెందిన జయాచౌదరితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్కతా పౌరుడినంటూ నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు.
మలక్పేట్లో నివాసం ఉంటున్న హసిబుల్.. నార్సింగి మున్సిపాలిటీ ఉద్యోగి సుధీర్కు రూ.15,000 లంచం ఇచ్చి నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సేకరించాడు. తరువాత ఓటరు కార్డు కూడా పొందాడు. ఇదే మార్గంలో బంగ్లాదేశ్కే చెందిన రోహన్ షాకూ నకిలీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇప్పించాడు. వీరిద్దరూ పాస్పోర్ట్కు దరఖాస్తు చేయగా.. అనుమానాస్పదంగా ఉండటంతో టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. మఫ్టీలో నార్సింగి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కావాలని అడగగానే సుధీర్ అంగీకరించడంతో బండారం బయటపడింది. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి మలక్పేట్ పోలీసులకు అప్పగించారు.
కాగా, దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరమైనవని నిపుణులు అంటున్నారు. ఉగ్రవాదులు నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి చట్టం నుంచి తప్పించుకోవడానికి, దేశంలో చొరబడటానికి, దాడులు చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ అనేది ఒక ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి అది ఉగ్రవాదుల చేతికి చిక్కితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.