|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 07:34 PM
ప్రభుత్వ వైద్య సేవలపై సామాన్య ప్రజల్లో నమ్మకాన్ని పెంచే దిశగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య విజయ ప్రసవాన్ని గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేయించారు. ఆమె ఆరోగ్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారి అయి ఉండి కూడా, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యాన్నే ఆశ్రయించడం విశేషం.పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య విజయ గర్భం దాల్చిన నాటి నుంచి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు విజయకు సాధారణ ప్రసవం ద్వారా కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.జిల్లా ప్రథమ పౌరుడిగా భావించే కలెక్టర్, తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించడం ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతుందనే సందేశాన్ని ప్రజలకు బలంగా పంపినట్లయింది. సామాన్యులకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై మరింత భరోసా కల్పించేలా కలెక్టర్ శ్రీహర్ష తీసుకున్న ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది