|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:59 AM
బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహాన్ శెట్టి నటించిన 'బోర్డర్ 2' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసే వరకు తాను చూడనని, ఒక పంతం పెట్టుకున్నానని ఆయన స్పష్టం చేశారు. జనవరి 23న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇటీవల ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026'లో సునీల్ శెట్టి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ‘దేశభక్తితో కూడిన ఈ సినిమా రూ.500 కోట్లు సాధించాలని నేను సినిమా రాకముందే గట్టిగా అనుకున్నాను. ఆ మార్క్ దాటిన తర్వాతే చూస్తానని మొక్కుకున్నా. ప్రస్తుతం సినిమా రూ.489 కోట్ల వద్ద ఉంది. మరో రూ.10-11 కోట్లు ఒక తండ్రి ప్రేమ కోసం దేవుడు ఇస్తాడని ఆశిస్తున్నా’ అని ఆయన భావోద్వేగంగా చెప్పారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'బోర్డర్ 2' చిత్రం 1997లో వచ్చిన క్లాసిక్ ఫిల్మ్ 'బోర్డర్'కు సీక్వెల్గా తెరకెక్కింది. తొలి భాగంలో సునీల్ శెట్టి కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. తన మొక్కు కారణంగా సినిమా ప్రీమియర్కు హాజరైనప్పటికీ, థియేటర్ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయానని సునీల్ శెట్టి తెలిపారు. ప్రస్తుతం లక్ష్యానికి చేరువలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ఆ మైలురాయిని దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News