by Suryaa Desk | Fri, Jul 12, 2024, 08:16 PM
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
గురువారం తూర్పు, మధ్య తెలంగాణలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
గురువారం రాత్రి యాదాద్రి, జనగామ, మహబూబ్నగర్, ఖమ్మం, సూర్యాపేట్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఫిలింనగర్, జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, రసూల్పుర, సోమాజిగూడ, అమీర్పేటలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
అటు, కృష్ణాబేసిన్లో ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద తగ్గింది. బుధవారం 84 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం 45 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 87.75 టీఎంసీలకు చేరింది. వరద రావడంతో జలవిద్యుత్ ఉత్పాదన కోసం నీటిని దిగువకు విడుదలు చేస్తున్నారు. దీంతో తుంగభద్ర జలాశయానికి 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. అటు, గోదావరి పరివాహక ప్రాంతంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 17,984 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 222 క్యూసెక్కులు, సింగూరుకు 391 క్యూసెక్కుల వరద రికార్డయింది. గత నెలలో ఆశించిన మేర వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో మొదలైనా.. వర్షాలు కురువకపోవడం వల్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి.