by Suryaa Desk | Fri, Jul 12, 2024, 09:09 PM
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలగనుంది. భాగ్యనగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో మొత్తం 6 స్టేషన్లు రాబోతున్నాయి. సగటున కిలోమీటరుకు అటుఇటుగా ఒక స్టేషన్ను ప్రతిపాదించారు. విజయవాడ జాతీయ రహదారి కావడం, కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేసే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి రెండువైపుల నుంచి మెట్రో స్టేషన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకోడానికి వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీతో కలిసి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు మెట్రోరైలు అధికారులు తుదిరూపు ఇచ్చారు.
రెండో దశ విస్తరణలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1కు పొడిగింపు అయిన ఎల్బీనగర్-హయత్నగర్ మార్గం ఒకటి. ఈ మార్గంలో చింతల్కుంట వద్ద ఒక స్టేషన్ ఏర్పాటుచేయనున్నారు. ఎల్బీనగర్ నుంచి చింతల్కుంట వరకు మధ్యలోరు మెట్రోరైలు మార్గం ఉంటుంది. మిగతా ఐదు స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది త్వరలోనే స్పష్టత రానుంది.
చింతల్కుంట నుంచి హయత్నగర్ మధ్య నేషనల్ హైవేస్ అథారిటీ ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టింది. దీంతో ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో మార్గం రానుందని హైదరబాద్ మెట్రో సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగర శివారులోని హయత్నగర్ నుంచి నిత్యం వేలాది మంది వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడార్కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్లోనే ఇరుక్కుపోతుంటారు. మెట్రో రైలు రాకతో వారి కష్టాలు తీరి.. ప్రయాణం సులభతరం కానుంది. ఐటీ కారిడార్ వరకు అనుసంధానం ఏర్పడనుంది. కాగా, బీహెచ్ఈఎల్ ప్రాంతంలోనూ పైవంతెన పక్క నుంచి మెట్రో రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ఇదే మార్గంలో గంగారం వద్ద డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు.