|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 06:07 PM
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏటీసీలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డిలో రెండేసి ఏటీసీలు ఉన్నాయి. బాల్కొండ, ఆర్మూర్, జుక్కల్, బోధన్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. తాజాగా కామారెడ్డి నియోజకవర్గంలో కొత్తగా ఒక ఏటీసీని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం భిక్కనూరు మండలంలోని గుర్జకుంటలో రెండెకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్నిలో ఎకరంన్నర స్థలాన్ని, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని ఇందల్వాయిలో నాలుగు ఎకరాల స్థలాన్ని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
టాటా టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు ఈ స్థలాలు ఏటీసీల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. స్థలాలు అనుకూలంగా ఉంటే రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. నిజామాబాద్ అర్బన్లోని బాలుర పాఠశాల, జుక్కల్లోని బిచ్కుంద, ఆర్మూర్లోని కమ్మర్పల్లి, బోధన్లో ఏటీసీలను ఇదివరకే ప్రారంభించారు. గత సంవత్సరం నుంచే ఇక్కడ విద్యార్థులకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఎల్లారెడ్డిలోని తాడ్వాయి, బాల్కొండలోని బీమ్గల్, నిజామాబాద్ అర్బన్లోని బాలికల ఏటీసీల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే నెల రెండో వారంలో ఈ ఏటీసీలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డిలో ఏటీసీ నిర్మాణం జరుగుతోంది.
ప్రతి ఏటీసీలో ఆధునిక యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఏటీసీకి దాదాపు రూ.6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు తరగతులు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను టాటా టెక్నాలజీస్ సంస్థ తీసుకుంటుంది. భిక్కనూరు మండలంలోని గుర్జకుంటలో ఏటీసీ కోసం కేటాయించిన స్థలాన్ని టాటా సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు ఐటీఐల జిల్లా కన్వీనర్ ప్రమోద్కుమార్ తెలిపారు. ఇందులో టెన్త్ పాసైన వారికి వివిధ కేటగిరీల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు జిల్లా ఉపాధి, శిక్షణ అధికారులను సంప్రదించాలని సూచించారు.