|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:44 PM
హైదరాబాద్ దారుస్సలాంలో శనివారం జరిగిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక బహిరంగ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందని, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టిన బడా నాయకులు ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ సభ నిర్వహించారని ఆరోపించారు. మజ్లిస్ నేతలను విష సర్పాల కంటే ప్రమాదకరమని.. వారు ముస్లిం ఓట్ల కోసం వక్ఫ్ ఆస్తులను దోచుకుని, పేద ముస్లింలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు.
ఈ రోజు మధ్యాహ్నం పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. దేశంలో 8 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు, 10 లక్షల కోట్ల రూపాయల విలువైనవని, వీటిలో సగం కంటే ఎక్కువ భాగాన్ని వక్ఫ్ బోర్డు ముసుగులో దోచుకున్నారని ఆరోపించారు. ఏటా 12 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా.. ఇది పేద ముస్లింల సంక్షేమానికి వినియోగించలేదని అన్నారు.
తమిళనాడులో 2 వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు, 1500 ఏళ్ల నాటి చంద్రశేఖర ఆలయ భూములు, హర్యానాలో గురుద్వారా భూములు, కర్నాటకలో లింగాయత్ భూములు, కేరళలో క్రైస్తవ మత్స్యకారుల భూములను వక్ఫ్ ఆస్తులంటూ ఆక్రమించారని ఆరోపించారు. తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో 80% ఆక్రమణకు గురై, ఒవైసీ కుటుంబం, మజ్లిస్ నేతలు ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్మించి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. పేద ముస్లింలకు ఒక్క గజం భూమి, రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ప్రధాని మోదీ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేస్తూ, దళితులు, బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నారని, ఒవైసీకి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపి, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, సీఎం విదేశీ పర్యటనలకు బదులు రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు.