|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:36 PM
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీతారాం ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర కృషి ఫలించిందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇది పెద్ద ముండుగు అన్నారు. గోదావరి జలాల కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో రూ.లక్ష కోట్లు మింగేశారని ఆరోపించారు.గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన నేపథ్యంలో, సీతమ్మసాగర్ బ్యారేజి నమ్మకంగా నిలబడుతుందా అని కేంద్ర జలవనరుల శాఖ ప్రశ్నించింది. తగిన అన్ని సాంకేతిక వివరాలు పంపిన తర్వాత అనుమతి ఇచ్చింది. అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరగబోయే ముంపు నష్టాన్ని నివారించేందుకు ప్రొటెక్షన్ వాల్ కోసం కేంద్ర నిధులు కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు.గత ప్రభుత్వం కృష్ణా జలాల పంపకంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని, న్యాయం కోసం ట్రిబ్యునళ్ల వద్ద వాదిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్గా పని చేస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో BRS ప్రభుత్వం చేసిన అవినీతిని, నాణ్యత లోపాలను ఎత్తిచూపుతూ.. వాళ్ళే కట్టారు.. వాళ్ళ హయాంలోనే కూలింది అంటూ విరుచుకుపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం లాంటి ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నట్లు NDSA నివేదిక ద్వారా తేలిన విషయాలను ప్రజలు గుర్తించాలన్నారు.