|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 08:21 PM
ప్రపంచ సుందరి పోటీల కోసం హైదరాబాద్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మే 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్నాయి. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో అలంకరణ, సుందరీకరణ పనులు చేస్తున్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ వద్ద ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా ఓ యువకుడు విద్యుత్ షాక్ గురయ్యాడు. అక్కడికక్కే మృతి చెందాడు.
భారతదేశంలో 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు హైదరాబాద్ వేదికైంది. ప్రపంచ సుందరి పోటీల్లో 120 దేశాలకు చెందిన యువతులు పోటీపడుతున్నారు. మే 7న ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో, మే 31న హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే వేడుకలు నిర్వహిస్తారు. విజేతలు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. పార్టిసిపెంట్స్కు, అతిథులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడుకలకు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు హాజరవుతారు. విమానాశ్రయంతో పాటు హోటళ్లు, ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
1951లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ.. ఈ మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు. అప్పటి నుంచి 74 ఏళ్లుగా ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏటా జరుగుతున్నాయి. ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచే ఈ కార్యక్రమానికి బ్రిటిష్ ప్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక 1951లో మొదటిసారి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినపుడు స్వీడన్కు చెందిన కెర్స్టిన్ కికీ హకాన్సన్ ఫస్ట్ మిస్ వరల్డ్గా నిలిచింది.