|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 06:50 PM
రంగారెడ్డి జిల్లాలో మహిళా లాయర్ హత్య కేసు పెను సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో ఆమె సోదరుడే అతి దారుణంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగానే.. బాధితురాలి సోదరుడు మరికొందరితో కలిసి కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపినట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. ఆమె సోదరుడితోపాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఓ నిందితుడు పరారీలో ఉండగా.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చేస్తున్నారు.
మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రోజున ఉదయం దారుణ హత్య చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో వివాదం కారణంగా లాయర్ స్వప్నను ఆమె సోదరుడు రాజు అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వప్న, ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదం తీవ్రంగా నడుస్తోందని పేర్కొన్నారు. 10 ఎకరాల భూమిని వారి తల్లి ఇద్దరికీ పంచిందని.. రాజుకు 6 ఎకరాలు.. స్వప్నకు 4 ఎకరాలు రాసి ఇచ్చినట్లు తెలిపారు. కానీ స్వప్నకు 4 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేని రాజు.. ఇటీవలి కాలంలో పదే పదే గొడవలకు దిగుతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లోనే తన సోదరుడు రాజుపై.. లాయర్ స్వప్న ఇప్పటికే రెండు సివిల్ కేసులను కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు తన తల్లి రాసిచ్చిన 4 ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు శనివారం ఉదయం స్వప్న అక్కడికి వెళ్లింది. ఇక అందులో ఒక ఎకరం భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం కాస్తా రాజుకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న రాజుకు, స్వప్నకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయగా.. స్వప్నపై రాజు దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్నపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. బండరాయిని తీసుకొచ్చి ఆమెను కొట్టి అత్యంత దారుణంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై స్పందించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం.. ఆస్తి వివాదం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. రాజుతోపాటు.. అతడి డ్రైవర్ గణేష్ సహా మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇక ఈ హత్య కేసు దర్యాప్తు కోసం 4 స్పెషల్ పోలీస్ టీమ్లను ఏర్పాటు చేశామని.. పరారీలో ఉన్న ఇంకో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. లాయర్ స్వప్నకు ఇంకా వివాహం జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బాధితురాలి తల్లి వెంకటమ్మ.. తన కుమార్తెను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా స్వప్నను చంపేందుకు.. రాజు ప్లాన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు.