|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:50 PM
నిజాంపేటలోని బండారీ లేఔట్కు ఆనుకుని ఉన్న తుర్క చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అక్కడి స్థానికులకు వివరించారు. చెరువులోకి మురికి నీరు చేరి పరిసరాలన్నీ దుర్గంధభరితంగా.. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 43.50 ఎకరాల చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ముందుగా మురుగునీరును బయటకు పంపి.. పూడికను తొలగించిన తర్వాత చెరువు సుందరీకరణ పనులు చేపడతామన్నారు.మురుగు నీరు కలవకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేసి.. చుట్టూ వాకింగ్ ట్రాక్లు, ప్లేఏరియాలు, పార్కులు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే కూకట్పల్లి నుంచి జీడిమెట్ల వెళ్లే ఉషాముల్లపూడి రోడ్డులో ఉన్న ఎల్లమ్మ కుంట అభివృద్ధికి కూడా సహకరిస్తామని తెలిపారు. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎస్ ఆర్ నిధులతో పనులు చేపట్టిన భవ్య కనస్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారిస్తామని.. వెంటనే ఈ పనులు చేపట్టాలన్నారు. ప్రగతినగర్ చెరువు చెంత చేపలు, మాంసం దుకాణాల తరలింపును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. త్వరలోనే ఈ చెరువు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా స్థానికులకు చెప్పారు. పలు కాలనీ వాసులు, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు హైడ్రా కమిషనర్కు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. చెరువుల అభివృద్ధితో పాటు.. పార్కులను, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతున్నారంటూ శాలువతో సన్మానించారు.