|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:00 PM
వేములవాడ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. నిధులు ఇచ్చేది ప్రధాని మోదీ అయితే, తెచ్చేది తానేనని అన్నారు. వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చేసేది కేంద్రం అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి సహా కాంగ్రెస్ ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చి, పిప్పి చేశారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తే కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మీ ముందుకు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మీకు ఎందుకు ఓటేయాలని వారిని నిలదీయాలని సూచించారు.వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తుంటే పోలీసులు వంతపాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. మా విజ్ఞప్తిని పోలీసులు చేతకానితనంగా భావిస్తున్నారా అని మండిపడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని లేదా అని నిలదీశారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే వేములవాడలోనే కూర్చుంటానని, మీ డీజీపీని, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని అన్నారు.