![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 07:40 PM
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంతో రీల్స్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. ఈ ఘటనపై విమర్శలు రాగా.. తాజాగా జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. నాగర్కర్నూల్ జిల్లా ఈగలపెంట మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈగలపెంట పోలీస్స్టేషన్కు చెందిన ఇన్నోవా వాహనాన్ని మంగళవారం (ఏప్రిల్ 8) ఇద్దరు యువకులు తీసుకెళ్లి రీల్స్ చేశారు. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ వద్ద రీల్స్ చేశారు. అదిరిపోయే లెవల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా పోలీస్ వాహనం ఎత్తుకెళ్లి రీల్స్ చేయటని నెటిజన్లు ప్రశ్నించారు. వీడియో వైరల్గా మారడంతో జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశాడు.
తాజాగా పోలీస్ వాహనంలో రీల్స్పై నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ఈగలపెంట పీఎస్ ఎస్ఐ వీరమల్లు మనవడు టిఫిన్స్ తెచ్చుకోవడానికి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేసినట్లు చెప్పారు. పోలీస్ వాహనం దొంగతనం జరగలేదని అన్నారు. ఈ ఘటనలో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని అన్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఎస్ఐ వీరమల్లుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా జరిగిన ఘటన అని ఎస్సైకి తెలిసే యువకులు వాహనం తీసుకెళ్లినట్లు చెప్పారు. అందుకే వారిపై కేసు పెట్టకుండా ఎస్సైపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.