![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 07:55 PM
తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్ తండ్రి శ్రీ కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం కన్నుమూశారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా అనంతన్ గుర్తింపు పొందారు. 2021లో తమిళిసై తల్లి మరణించగా.. తాజాగా ఆమె తండ్రి కూడా మరణించారు. తండ్రి మృతితో తమిళిసై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మృతదేహం ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రిని తట్టి లేపుతూ బోరున ఏడ్చారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బీజేపీ శ్రేణులు, కాంగ్రెస్ నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా, పలువురు ప్రముఖులు తమిళిసై నివాసానికి చేరకొని కుమారి అనంతన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
అనంతన్ మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 'తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారి తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త శ్రీ కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు అనంతన్ గారిని కోల్పోవడం ఎంతో బాధాకరం. కుమారి అనంతన్ నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళిసై గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నా. అనంతన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.' అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
కాగా, 2019లో తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన తొలి మహిళ ఆమె. 2021న ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. 2024న ఆమె తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో చెన్నై దక్షిణ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.