|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 12:38 PM
అమీన్పూర్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్,. పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంత నగదు తో నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు.. నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని.. పటాన్చెరులో ఏడుపుట్ల యాభై లక్షల రూపాయలతో మైత్రి స్టేడియం ఆధునికరించడం జరిగిందని గుర్తు చేశారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను.. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అరవ రామకృష్ణ, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుక, రిష్వంత్ రెడ్డి, షకీల్, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.