|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:09 PM
మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పుడు చలికి గజ గజ వణుకుతున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగర వాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలో మూడు రోజులు పాటు చలి తీవ్రత పెరుగుతుందని.. ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు, రేపు చలి అధికంగా ఉంటుందని.. కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆ వివరాలు..
పెరిగిన చలి తీవ్రతతో తెలంగాణలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో తెలంగాణలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్లో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇక కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసంవత్సరం కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజాగా జిల్లాలోని లింగాపూర్ మండలంలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా తిర్యాణి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేటలో 8.7, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 8.8, మెదక్ జిల్లాలో ఉన్న శివ్వంపేటలో 9, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రుద్రంగిలో 9.1, ఆదిలాబాద్ జిల్లా, బజార్హత్నూర్లో 9.3, కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలోని నస్రూల్లాబాద్, సాలూరులో 9.4, సిద్దిపేట జిల్లాలో ఉన్న అక్బర్పేట-భూంపల్లి ప్రాంతంలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలే ఉన్నాయి. ఈ రెండు రోజులు అనగా శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. అలానే చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రెండు రోజుల క్రితమే హెచ్చరించింది.. యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ఉదయం, రాత్రి సమయాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.