|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:07 PM
ఈఏడాది కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాలనే మిగిల్చాయి. ఇక తాజాగా వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పత్తి, వరి, మిరప చేలు పెద్ద పరిమాణంలో దెబ్బ తిన్నాయి. ధాన్యం తడిచింది. ఎండబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఇక పత్తి రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈసంవత్సరం పత్తి రైతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు పత్తి తడవడం.. మరో వైపు సీసీఐ నిబంధనలు వెరసి పత్తి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఈక్రమంలో మిర్చి రైతులకు మాత్రం ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. తాజాగా క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.30 వేల రూపాయలు పలికింది. సీజన్ ప్రారంభంలో ఇంత భారీ ధర పలకడం శుభపరిణామం అని చెప్పవచ్చు. అయితే పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే వరకు ఇదే ధర ఉంటే.. రైతులకు చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. కానీ అప్పటికి ధరలు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు.
ఇక తాజాగా శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి గరిష్ట ధర పలికింది. టమాటా రకం మిర్చి.. క్వింటార్ ధర ఏకంగా రూ.30 వేలు పలికింది. ఇక తేజ షార్క్ రకం మిర్చి.. క్వింటాల్ రూ. రూ.15,111లు పలికింది. దీంతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అయినా మంచి ధర ఉంది.. ఇది సీజన్ అయిపోయే వరకు కొనసాగితే.. రైతులకు ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు. మిర్చి గరిష్ట ధర పలకగా.. మరో వైపు మక్కలు (బిల్టీ) క్వింటాల్కు రూ.2,075 పలికాయి.
దీంతో మార్కెట్కు మిర్చి, మక్కలు తెచ్చిన రైతులు గరిష్ట ధర పలకడంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... సీజన్ ప్రారంభం కాకముందే మిర్చికి మంచి ధర వస్తోంది. అయితే సీజన్ మొదలయ్యాక.. ధరలు పడిపోతుంటాయి. దీనిపై ఆఫీసర్లు, ప్రజాప్రతినిధిలు స్పందించి సరైన చర్యలు తీసుకుని.. చివరి వరకు ఇదే ధరలు కొనసాగేలా చూడాలి.. అప్పుడే రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుంది అంటున్నారు.
ఇదిలా ఉంటే గత సంవత్సరం అనగా 2024, అలానే 2025 ప్రారంభంలో మిర్చి ధర దారుణంగా పడిపోయింది. ఒకానోక సందర్భంలో మిర్చి క్వింటాల్ ధర రూ.7 వేలకు పడిపోయింది. దీంతో చాలా మంది రైతులు ఈ సారి మిర్చి సాగు చేయలేదు. మరి ఈ సంవత్సరం మిర్చి ధర ఎంత ఉంటుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.