|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:12 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చెందిన ప్రభుత్వ ఆఫీసులను అధికారులు విజయవాడకు తరలించారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది.ఈ నెలాఖరులోగా అద్దె భవనాలను ఖాళీ చేయాలని అందులో ఆదేశించింది. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లింపును నిలిపివేయాలని ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ్ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్, ఎర్రమ్ మంజిల్ వంటి భవనాలను పరిశీలించి తమ ఆఫీసులను తక్షణమే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, సీఎస్ లు, డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను ఆర్థిక శాఖ ఆదేశించింది. జనవరి 1 నుంచి కచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే ఆఫీసులు కొనసాగాలని స్పష్టం చేసింది.