|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించిన దాని ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుండి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నాలు చేపట్టనున్నారు. దీంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోనున్నాయి. అంతేకాకుండా.. జూన్ 9వ తేదీన హైదరాబాద్ నగరంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ఒక భారీ మహాధర్నా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గత 16 నెలలుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు .. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వేచి చూసే ఓపిక లేదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోగా, కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అనేక ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగులు ముందుకు తెచ్చారు. వాటిలో ముఖ్యమైనవి పెండింగ్లో ఉన్న రూ. 9 వేల కోట్ల బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలి, ఉద్యోగులకు త్వరగా పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని అమలు చేయాలిజజ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఈ డిమాండ్లతో పాటు, ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
తమ నిరసనను మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. వర్క్ టు రూల్ (నిబంధనల ప్రకారం మాత్రమే పని చేయడం), పెన్ డౌన్ (పనిని నిలిపివేయడం).. సామూహిక సెలవుల వంటి చర్యల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు యోచిస్తున్నారు. ఈ ఉద్యమంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగుల ఐక్య పోరాటం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపుతుందో లేదో చూడాలి.
రూపిరెడ్డి లక్ష్మి.. ఈవిడను చూస్తే రైతేరాజు కాదు రైతే రాణి అనాల్సిందే!
ఇదిలా ఉండగా.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు తాను కూడా కార్మికుల సమస్యలను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. సంస్థ ప్రస్తుతం నష్టాల నుండి క్రమంగా కోలుకుంటోందని, సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన వివరించారు. ఈ సమయంలో సమ్మెకు వెళ్లడం సరికాదని, కార్మికులు సహకరించాలని ఆయన కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు.