![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 08:36 PM
ఒక జింకను చంపిన నటుడు సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల శిక్ష పడితే, వందల నెమళ్లు, జింకలను చంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నేళ్లు శిక్ష పడాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్వీ, హెచ్సీయూ విద్యార్థులతో కలిసి ఆయన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు. కంచ గచ్చిబౌలిలోని భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసమే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, మానవత్వం లేకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను విధ్వంసం చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం యూనివర్సిటీని ధ్వంసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.భూములను కాపాడుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో హెచ్సీయూ భూములు గెలవగానే వాటిని తాకట్టు పెట్టి రూ. 20 వేల కోట్లు అప్పు తెచ్చారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.