|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:48 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో నిన్న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సమావేశంలో స్టేట్ లెవల్ కమిటీతో పాటు జిల్లా, టౌన్ స్థాయి కమిటీల ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ కమిటీలు భవిష్యత్తులో ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని నేతలు తెలిపారు. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించేలా అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.
Latest News