|
|
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:52 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల వ్యవహారం రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాలను.. పదుల సంఖ్యలో జేసీబీలతో చదును చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టగా.. ఈ వ్యవహారంపై హెచ్సీయూ విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో పిల్ కూడా దాఖలు కాగా.. హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే.. ఈ భూముల వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ కూడా జోక్యం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లోని వృక్షాలను అక్రమంగా నరికివేయడంపై రాష్ట్ర అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని.. వన్యప్రాణులు.. సరస్సులు.. పురాతన రాతి నిర్మాణాలకు నష్టం కలిగించారని వివిధ వార్తా పత్రికలు, మీడియా ఛానళ్లలో రకరకాల కథనాలు ప్రచురితమవటంతో.. కేంద్ర పర్యావరణ శాఖ స్పందించింది.
పర్యావరణానికి విఘాతం కలిగించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖను కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశించింది. ఇకపై ఎలాంటి వివాదానికి తావు లేకుండా.. యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఆ భూముల్లో ఉన్న చెట్లు, జంతుజాలానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పర్యావరణ శాఖ సూచించింది. ఈ వ్యవహారంలో నిజానిజాలపై విచారణ జరిపించి.. పూర్తిస్థాయి నివేదికను అందించాలని తెలంగాణ అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశించింది. కోర్టులు, ట్రిబ్యునల్స్ గతంలో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన లేకుండా చర్యలు తీసుకోవాలని కీలక సూచనలు చేసింది.
మరోవైపు.. ఈ వ్యవహారంలో వటా పౌండేషన్తో పాటు హెచ్సీయూ విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరపు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. రేపటి (ఏప్రిల్ 03) వరకు చెట్లు నరకడం ఆపేయాలని, ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.