by Suryaa Desk | Fri, Jan 31, 2025, 08:11 PM
సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని.. బల్దియాలు అంటే ఖాయా.. పియా.. చల్దియా.. అనే సామెత ఉండేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.తెలంగాణ భవన్లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్తో పని చేయాలని దిశా నిర్దేశం చేశారన్నారు. అందుకే ఆర్థిక ఇంజిన్లుగా ఉన్న పట్టణాలను, వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. పట్టాణాల విస్తరణ ఆపడం వీలు కాదు.. కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశామన్నారు. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు.
పదేళ్ల పాటు జరిగిన పట్టణాలు అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదన్నారు. పక్కా ప్రణాళికతో పాటు అవసరమైన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ అవసరమైన నిధులు అందించడం తదితర నిరంతర ఫోకస్తోనే తెలంగాణలోని పట్టణాలు ఈ రోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయన్నారు. తెలంగాణ పట్టణాలకు పదేళ్లలో అనేక జాతీయ అవార్డులు దక్కాయన్నారు. గత పది సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లుగా పట్టణాల అభివృద్ధి కోసం పని చేశారన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేశారని చెప్పారు. పదవీ కాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలని.. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టామన్నారుకొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గరైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగిందన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పట్టణాలు అభివృద్ధి కుంటుపడడంతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో నల్లగొండ పట్టణాన్ని సమూలంగా అభివృద్ధి చేసిన మనల్ని కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. కానీ అదే నల్లగొండ పట్టణంలో నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మంత్రి సీనియర్ అయినా అభివృద్ధి పట్టించుకోలే..
నల్లగొండ పర్యటన తర్వాత నన్ను బచ్చగాడు అంటున్న మంత్రి.. సీనియర్ అయ్యుండి పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోసపూరిత 420 హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పాలన చేతకావడం లేదన్నారు. టకీ టకీ మని పైసలు పడుతాయన్నారని.. కానీ, టకీ టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయన్నారు. ఆరున్నర లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వనేలేదంటూ అబద్ధాలు చెబుతుందన్నారు. ఈ విషయం అప్పటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందన్నారు. డూప్లికేట్ గాంధీలకు తెలంగాణ ఇచ్చిన హమీలను అమలు చేసేలా బుద్ధి ఇవ్వాలని మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు.