|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:27 PM
టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త విధానాల్లో కోట్ల రూపాయల డబ్బును కొట్టేస్తున్నారు. ప్రజలకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఫలితం లేకుండా పోతోంది. అయితే అత్యాధునిక టెక్నాలజీతో పోలీసులు కూడా సైబర్ నేరగాళ్లను పట్టుకుంటున్నారు. దేశంలోని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి.. ఎవరికీ తెలియకుండా ఓటీపీలు, పిన్ నంబర్లు, అకౌంట్ నంబర్లు లేకుండానే డబ్బులు కాజేస్తున్నారు. ఇక సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు.
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక ఈ సైబర్ నేరగాళ్లలో కొందరు బ్యాంక్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించడం పెను సంచలనంగా మారింది. 32 స్పెషల్ టీమ్స్తో 16 రాష్ట్రాల్లో ఏకంగా 10 రోజుల పాటు ఈ ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన ఈ 104 మంది సైబర్ నిందితులపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఈ నిందితులు ఇప్పటివరకు పలు సైబర్ నేరాలు చేసి.. ఏకంగా రూ.127 కోట్లకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ సైబర్ నిందితుల నుంచి రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 204 సెల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ అకౌంట్ బుక్లు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లను కూడా సీజ్ చేశారు.
మరోవైపు.. గత నెలలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జల్లెడ పట్టిన హైదరాబాద్ పోలీసులు 37 మంది సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లలో 26 కీలక కేసులను కూడా ఛేదించినట్లు తెలిపారు. ఇక జనవరిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం 117 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. వాటిలో పెట్టుబడి మోసాలకు సంబంధించి 15 కేసులు.. 2 డిజిటల్ అరెస్ట్ కేసులు, 4 సోషల్ మీడియా మోసాలు, బిజినెస్, గేమింగ్, జాబ్ మోసాలకు సంబంధించి మరో 5 కేసులు ఉన్నాయి. రూ.65 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపారు. ఈ కేసుల్లో బాధితులకు రూ.71.91 లక్షలను రీఫండ్ చేశారు.