|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 07:54 PM
తెలంగాణలో కొన్ని డ్రగ్స్ ముఠాల ఆగడాలు పెరిగిపోతుండటం.. వారిని పట్టుకునే క్రమంలో రెచ్చిపోతుండటం తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆబ్కారీ శాఖ (ఎక్సైజ్ శాఖ) అధికారుల భద్రత, రక్షణ కోసం.. రేవంత్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని.. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు.. ఎక్సైజ్ అధికారుల ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు ఇచ్చే అంశం.. ఇప్పడు సర్కార్ పరిశీలనలో ఉందని తెలిపారు.
ఎక్సైజ్ శాఖ అధికారులకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆయుధాలను అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను.. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి.. మాదక ద్రవ్యాలు అనే మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల అవతలికి తరిమికొట్టి.. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే సామాజిక అనర్థాలపై మంత్రి జూపల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు.. తమ విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. గంజాయి ముఠా ఆట కట్టించే క్రమంలో ఇటీవల కానిస్టేబుల్ సౌమ్య చనిపోవడం చాలా దురదృష్టకరం అని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి ఆమె కుటుంబానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి ఆర్థిక సాయాన్ని అందించినట్లు గుర్తు చేశారు.
నిజామాబాద్లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలించే ముఠాను పట్టుకునేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య.. తన ప్రాణాలకు పణంగా పెట్టారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. గంజాయి ముఠా తమ వాహనంతో ఆమెను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన సౌమ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.