|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:08 PM
దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల్లో వాతావరణం మారబోతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీరం వెంబడి కొత్తగా అల్పపీడన వ్యవస్థ ఏర్పడినట్లు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా కేరళ, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ అల్పపీడన ప్రభావం వల్ల నేడు దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ కనుమలకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే జనవరి 28 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని, మళ్లీ జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్ పేర్కొంది.అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో దక్షిణ తమిళనాడు తీరం, మన్నార్ సింధుశాఖ, కొమొరిన్ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రపు అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.