by Suryaa Desk | Wed, Jun 26, 2024, 08:42 PM
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం (జూన్25) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్లో ఉండటమే కాకుండా 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలు అన్నింటిని తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నడ్డాకు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగానూ 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) సమర్థంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన మౌలిక వసతులు, నిర్వహణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ.231.40 కోట్ల నిధులను కూడా తక్షణమే రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల జాప్యంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.