by Suryaa Desk | Wed, Jun 26, 2024, 09:16 PM
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకారంతో రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో తాను భేటీ అయినట్లు చెప్పారు. తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరామన్నారు. ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ – విజయవాడ ఎన్ హెచ్-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కోరారు.
వాహనాల రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాన్నారు. అలాగే ఎన్ హెచ్-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న ఎన్జీటీ సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న ఎన్ హెచ్-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్ను సంతోష్ కుమార్ను కోరారు. తక్షణమనే డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో 16 జాతీయ రహదారుల మంజూరీ, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనుల పూర్తి వంటి అంశాలపై రెండ్రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వినతుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల కోసం కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.