by Suryaa Desk | Tue, Jul 02, 2024, 09:40 PM
తెలంగాణలో ఈసారి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. వస్తే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక దరిద్రమైన లక్షణం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఒకసారి అధికారంలోకి వస్తే.. పిచ్చిపిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకుంటారని.. వివరించారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ ఛైర్మన్లతో.. మంగళవారం (జులై 02న) ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. బీఆర్ఎస్ సర్కారులో జడ్పీ ఛైర్మన్లంతా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ కొనియాడారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత.. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేవాళ్లే నిజమైన రాజకీయ నాయకులని కేసీఆర్ వివరించారు.
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తిందని మండిపడ్డారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారని.. అలాంటప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే.. పార్టీ ఫిరాయింపులపై కూడా గులాబీ బాస్ స్పందించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుంది కానీ.. నాయకులు పార్టీని సృష్టించరని వివరించిన కేసీఆర్.. మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని.. "4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా?" అని ప్రజలే అసహ్యించుకుంటున్నారని గులాబీ బాస్ తెలిపారు.
రాజకీయాల్లో ఉన్న వారికి సౌజన్యం, గాంభీర్యం ఉండాలని పేర్కొన్న బీఆర్ఎస్ అధినేత.. అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తు చేశారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని.. కొంచెం సమన్వయంతో ఉండాలని కేసీఆర్ సూచించారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని.. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా జరిగితే.. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని.. ఈసారి బీఆర్ఎస్ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమని కేసీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు . సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.