by Suryaa Desk | Fri, Jul 05, 2024, 07:24 PM
హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట సమీపంలో కాల్పులు కలకలంరేపాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను ఛేజ్ చేసిన పోలీసులు.. వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్లోని వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ఠి గ్యాంగ్ కొంతకాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను టార్గెట్ చేస్తోంది. వరుస దొంగతనాలతో నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు.. ఎస్పీ శరత్ స్పెషల్ టీమ్లను రంగంలోకి దించారు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ఈ దొంగల ముఠా పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని వెంబడించారు. ఇలా ఆ గ్యాంగ్ను వెంటాడుతూ వస్తూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేశారు. పార్థి గ్యాంగ్లో దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు కలిసి వారిని వెంబడించారు.
ఆ దొంగల ముఠాను వెంటాడుతూ పెద్దఅంబర్పేట సమీపంలో.. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు రాగానే.. దొంగలు కత్తులతో పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఈ దొంగల ముఠాలోని వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు.. ఇంకా ఈ గ్యాంగ్లో ఉన్నవారిని పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇటీవల హైదరాబాద్ చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్లో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో కాల్పులు జరిగాయి.. కొంతకాలంగా ఈ పార్ఠి గ్యాంగ్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ గ్యాంగ్ వరుసగా చోరీలకు తెగబడుతోంది.. దీంతో పోలీసులు నిఘా పెంచారు.. వీరిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల హైవేపై చోరీలు చేస్తున్నట్లు గుర్తించి.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్లను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఆ గ్యాంగ్ చోరీ చేసి పారిపోతున్న సమయంలో పోలీసుల కంటపడ్డారు.. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇదంతా జరిగింది.