by Suryaa Desk | Fri, Jul 05, 2024, 07:29 PM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. జులై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. జులై 7న ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ.. జులై 8న సోమవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. అటు, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మంతో పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివారులోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, పహడీషరీఫ్, తుక్కుగూడ, బాలానగర్, బీఎన్ రెడ్డి నగర్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నైరుతి రుతపవనాలకు తోడు ఉపరితలగాలులు వీస్తున్నాయని, గురువారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.
ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. అలాగే, హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర తెలంగాణలోనూ చిరుజల్లులు కురుస్తాయని వెల్లడించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటికి తోడు ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు పడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై 6 నుంచి రుతుపవనాలు చురుకుగా మారుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందుగానే కేరళకు తాకి.. అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. అయితే, ఆశించిన స్థాయిలో మాత్రం వర్షాలు కురవలేదు. కానీ, జులైలో వర్షాలు దంచికొడతాయని ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం శుభపరిణామం.