by Suryaa Desk | Fri, Jul 05, 2024, 07:44 PM
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దురదృష్టం వీడటం లేదు. కవిత జ్యూడీషియల్ రిమాండ్ను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈసారి జులై 18వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. లిక్కర్ పాలసీలో.. మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ సీబీఐ అధికారులు.. కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో కవితపై విధించిన జ్యూడిషయల్ రిమాండ్ ఈరోజుతో ముగియగా.. తీహార్ జైలు అధికారులు ఆమెను వర్చువల్గా ట్రయల్ కోర్టు ముందు హాజరు పరిచారు.
ఈ కేసులో కవితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని మరోసారి పెంచింది. జూలై 18 వరకు రిమాండ్ విదిస్తూ.. కోర్టు తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే.. ఈడీ కేసులో కవితకు జూలై 25వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ నెల మర్చిపోవాల్సిందే. మళ్లీ జులై 25న కోర్టు ముందు హాజరుపరిస్తే.. అప్పటికి గానీ ఎలాంటి తీర్పు వస్తుందో తెలియని పరిస్థితి.ఇదిలా ఉంటే.. కవితను బెయిల్ ఇచ్చేందుకు ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా.. ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు కూడా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చి.. చివరికి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కవితపై నమోదైన రెండు కేసుల్లోనూ.. బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇటు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ.. అటు రిమాండ్ పెంపుతో.. ఇప్పట్లో కవిత బయటకు వచ్చేపరిస్థితి కనిపించట్లేదని.. మరో నెల మర్చిపోవాల్సిందే అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్టవగా.. ఆయనకు కూడా ఇప్పటివరకు బెయిల్ రాకపోవటం గమనార్హం. అయితే.. కవితకు కూడా ఇదే పరిస్థితి ఎదురవనుందా.. అన్న అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ కేసులో కవితే కీలక సూత్రదారి, పాత్రదారి అంటూ అటు సీఐడీ, ఇటు ఈడీ పదే పదే ఆరోపిస్తూ.. ఛార్జిషీట్లలో సంచలన అభియోగాలు మోపుతుండటం గమనార్హం.