by Suryaa Desk | Fri, Jul 05, 2024, 07:47 PM
సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రోడ్డుపై నిబంధనలకు నీళ్లొదిలి రయ్యిమంటూ దూసుకెళ్తున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో రోజూ ఎక్కడో ఓ దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ.. ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ ప్రమాదాలకు కారణం.. అతివేగమో, నిర్లక్ష్యమో, నిబంధనలు పాటించకపోవటమో.. కారణం ఏదైనా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే.. ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయటమే కాకుండా.. తరచూ పట్టుబడేవారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. దేశంలో చాలా వరకు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల, మైనర్లు వావనాలు నడపటం వల్లే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
అయితే.. గతంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే.. పెద్దలకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా 25 వేల రూపాయల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా, పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపినా.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా.. 2 వేల వరకు జరిమానా విధించనున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే.. తెలంగాణలోనూ ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారం.. జరిమానాలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జరిమానాలకు ఏకంగా ఐదు రెట్లకు పైగానే వసూలు చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాల్లో ఈ జరిమానాల పట్టికలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్ట్ చూస్తుంటే.. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో సీన్.. తెలగాణలోనూ రిపీట్ అవ్వబోతుందా అనిపిస్తోంది. మరి ఈ లిస్ట్ ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు ఇవే..!
రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేస్తే..
గతంలో జరిమానా : రూ. 100
ప్రస్తుతం జరిమానా : రూ.500
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.100
ప్రస్తుతం జరిమానా : రూ.1000 తో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే..
గతంలో జరిమానా : రూ.500
ప్రస్తుతం జరిమానా : రూ.2000
మద్యం సేవించి వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.2000
ప్రస్తుతం జరిమానా : రూ.10000
సీటు బెల్ట్ పెట్టుకోకపోతే..
గతంలో జరిమానా : రూ.100
ప్రస్తుతం జరిమానా : రూ.1000
ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే..
ప్రస్తుతం జరిమానా : రూ.1200
అత్యవసర వాహనాలను నిరోధిస్తే..
ప్రస్తుతం జరిమానా : రూ. 10,000
సాధారణ ఉల్లంఘన..
గతంలో జరిమానా : రూ.100
ప్రస్తుం జరిమానా : రూ.500
అథారిటీ రూల్స్ అతిక్రమిస్తే..
గతంలో జరిమానా : రూ.500
ప్రస్తుతం జరిమానా : రూ.2000
అతివేగంగా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.400
ప్రస్తుతం జరిమానా : రూ.1000
ప్రమాదకరంగా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.2000
ప్రస్తుతం జరిమానా : రూ.5000
రేసింగ్ చేస్తూ పట్టుబడితే..
గతంలో జరిమానా : రూ.500
ప్రస్తుతం జరిమానా : రూ.5000
ద్విచక్రవాహనాలపై హెవీ లోడ్..
గతంలో జరిమానా : రూ.100
ప్రస్తుతం జరిమానా : రూ.1200 తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం..
గతంలో జరిమానా : రూ.1000
ప్రస్తుతం జరిమానా : రూ.2000
కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు.. హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో నమోదు అయింది. ఓ వాహనదారులు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినందుకు అతడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 281, 80(ఏ), 177 మోటర్ వెహికిల్ చట్టం కింద కేసు నమోదు చేయటం గమనార్హం.