by Suryaa Desk | Sat, Jul 06, 2024, 07:46 PM
ఈ ప్రిన్సిపాల్ మేడం మాకొద్దు సార్ అంటూ ఆందోళనకు దిగారు గురుకుల కాలేజీ విద్యార్థినిలు. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి రాత్రి పూట మేడం బీర్లు తాగుతున్నారని.. ఆమె ప్రవర్తనా తీరుతో తమకు భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలు గురువారం రాత్రి (జూలై 4) ప్రిన్సిపాల్ గదిలో 4 బీర్ బాటిళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనను సెల్ ఫోన్లలో చిత్రీకరించి మీడియా ముందు పెట్టారు. గదికి తాళం వేసి మూసేశారు. తెలంగాణలో ఆడవాళ్లు బీర్లు తాగడం అనేది పెద్ద విషయమేమీ కాకపోవచ్చు! కానీ, ఒక కాలేజీ ప్రిన్సిపాల్ అయుండి, అందులోనూ రెసిడెన్షియల్ కాలేజీలో ఉంటున్న వందలాది ఆడపిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతాయుతమైన విధుల్లో ఉండి.. హాస్టల్లోనే ఆల్కహాల్ తాగితే.. అది ఎంత పెద్ద నేరం?! బయట ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగాలు రాక తిప్పలు పడుతుంటే.. ఇలాంటి ఉన్నత స్థానంలో ఉండి, చేసేవి ఇలాంటి పనులా? ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలివి.
అంతకంటే ముందు ఈ అమ్మాయిల తెగువకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎంత ధైర్యంగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారూ..? ఆ మేడం తీరుతో ఎంత కాలంగా విసిగి వేసారుతున్నారూ..! అమ్మాయిలు మీడియాతో, పోలీసులతో, అధికారులతో మాట్లాడిన తీరు చూస్తే, ప్రశంసించకుండా ఉండలేరు. ‘మేం మేజర్స్ సార్. మేడం మమ్మల్ని ఎలా కొడతారు. ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. అసలు కొట్టెతందుకు రూలే లేదు. 5వ తరగతి నుంచే పిల్లల్ని కొట్టరు. మేం డిగ్రీ స్టూడెంట్స్. అందరం మేజర్స్. అందరికీ ఓటు హక్కు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతది సార్. మా పేరెంట్స్ ఏం చేసిండ్రు సార్..? మా పేరెంట్స్పై ఎట్లబడితే అట్ల మాట్లాడ్తది. బూతులు తిడ్తది. మా మీద ఎగబడ్తది. నైట్ టైమ్ ఆల్కహాల్ తాగి, మా మీద ఎగబడితే.. ఏమన్నా చేస్తే.. బాధపేడి మా పేరెంట్స్ కదా సార్..?’ - ఓ విద్యార్థి ఆవేదన.
అమ్మయిల హాస్టల్కు మేడం కొడుకు ఎందుకు వస్తాడు సార్..? విద్యార్థులు అడుగుతున్న మరో ప్రశ్న ఇది. ‘వాళ్ల కొడుకు వచ్చినప్పుడు చాలా అన్-కంఫర్ట్గా ఫీలయ్యాం సార్. మేమందరం ఆడపిల్లలం. తరగతులు అయిపోయాక, హాస్టల్లో షార్ట్స్ వేసుకుంటాం. ఇంకా ఎట్లనైనా ఉంటాం. వాళ్ల కొడుకు హాస్టల్కు ఎందుకు వస్తాడు సార్? వచ్చి 6 రోజులు ఉన్నాడు. ఎంత అన్కంఫర్ట్గా ఉంటుంది సార్..?’ అంటూ గురుకుల కాలేజీలో జరుగుతున్న వ్యవహారాల గురించి మరో విద్యార్థి చెప్పుకొచ్చింది.
‘ఏదైనా ఇష్యూ గురించి ప్రశ్నిస్తే, ఆ స్టూడెంట్స్ను టార్గెట్ చేస్తారు. వేధిస్తారు. వాటర్ బాటిళ్లు, కర్రలు విసిరేస్తారు. గొంతు పట్టుకొని పిసుకుతారు. కొడతారు, తిడతారు’ అంటూ ప్రిన్సిపాల్ శైలజా మేడం తీరు గురించి చెప్పుకొచ్చారు విద్యార్థినిలు. వంట గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చేవాళ్లు, సరకులు తెచ్చేవాళ్లూ అమ్మాయిల హాస్టల్లోకి సాయంత్రం 7 గంటల తర్వాత ఎలా వస్తారు సార్? - ఇలా అనేకం ఉన్నాయి వాళ్ల సమస్యలు, ప్రశ్నలు.
‘మేడంకి అధికారుల అండ ఉంది. అందుకే మేం ఇంతదాకా రావాల్సి వచ్చింది’ అని విద్యార్థినిలు చెబుతున్నారు. బీర్లు బాటిళ్లు పట్టుకున్న తర్వాత రాత్రంతా తమకు నిద్రలేదని చెప్పారు. ఏం చేస్తారో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వెళ్లగక్కారు.
ఇంతకీ ఎలా పట్టుకున్నారు?
కేర్ టేకర్గా పనిచేసే మహిళ ఓ బ్యాగులో బీరు బాటిళ్లు పెట్టుకొని, అవి పైకి కనిపించకుండా చీర కప్పి తీసుకెళ్తుంటే విద్యార్థినిలు ఆమెను అడ్డగించారు. ఆ బ్యాగులో ఏమున్నాయో చూపెట్టాలని నిలదీశారు. ‘బ్యాగు గురించి అడిగితే మూతి పగులుతుంది’ అంటూ ఆమె బెదిరించిందట. అమ్మాయిలు స్కూటీ తాళాలు లాక్కొని బ్యాగ్ తెరిచి చూశారు. ఆ తర్వాత మేడం ఆటకట్టించారు.
స్కూటీ తాళం లాక్కున్నందుకు కేసు పెడతామంటూ విద్యార్థులను బెదిరించారు. వాళ్లు అస్సలు భయపడలేదు. దీంతో ఇప్పుడు ఈ ఘటన హైలైట్ అయ్యింది. గురుకుల కాలేజీ హాస్టల్కి డిప్యూటీ కలెక్టర్, ఉన్నతాధికారులు, పోలీసులు వచ్చారు. విద్యార్థుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. విద్యార్థులు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసేవాళ్లందరూ వాటిని ‘సరస్వతీ ఆలయాలు’గా భావించేలా కనువిప్పు కలగాలి.