by Suryaa Desk | Sat, Jul 06, 2024, 09:29 PM
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గోవాలోని వాస్కోడగామా స్టేషన్కు వారానికి రెండు రోజుల పాటు ఈ స్పెషల్ రైలు ప్రయాణించనున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రికి కిషన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.
ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వాస్కోడగామా స్టేషన్కు వారంలో రెండు రోజులు వెళ్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇక వాస్కోడగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్కు గురు, శనివారాల్లో తిరిగి వస్తుందని స్పష్టం చేసింది. ఇక ఈ రైలు సర్వీస్కు సంబంధించి.. టికెట్ ధరలను తమ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని రైల్వే శాఖ తేల్చి చెప్పింది.
ఈ సికింద్రాబాద్-గోవా స్పెషల్ బై వీక్లీ రైలు.. తెలంగాణ, ఏపీల్లో ఎక్కడెక్కడ ఆగుతుందో కూడా రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ స్టేషన్లలో ఈ రైలు ఆగనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కర్ణాటకలోకి చేరుకుని.. బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్ మీదుగా గోవాలోకి ఎంటర్ అయి.. లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.
ఇక సికింద్రాబాద్ నుంచి గోవాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో ఇక్కడి నుంచి గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.