by Suryaa Desk | Sat, Jul 06, 2024, 09:36 PM
అబార్షన్ కోసం ఓ బాలిక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. కేసు విచారించిన న్యాయస్థానం ఆమెకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలిక, ఆమె తల్లి అనుమతి మేరకు అవాంఛనీయ గర్భం తొలగించాలని గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలికపై 10 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 6 నెలల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో బాలికకు అబార్షన్ చేయించేందుకు ఆమె తల్లి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు గర్భం తీసేసేందుకు నిరాకరించారు. దీంతో బాలిక, ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబార్షన్కు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. బాలిక తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అభం శుభం తెలియని వయస్సులో కొందరు దుర్మార్గులు చేసిన పనికి బాలిక గర్భం దాల్చిందని వాదించారు. దీని వల్ల బాలిక శరీరకంగా, మానసికంగా వేదనకు గురవుతుందని చెప్పారు. అబార్షన్ కోసం గాంధీ ఆసుపత్రికి వెళితే నిరాకరించారని విన్నవించారు.
ప్రత్యేకంగా గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి అబార్షన్కు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సమర్పించాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీచేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన సూపరింటెండెంట్ బాలికను పరీక్షించి ఆరోగ్య పరిస్థితిపై న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు.
డాక్టర్లు సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి విజయ్సేన్ రెడ్డి ఇలాంటి ఘటనలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు. బాలిక, ఆమె తల్లి అనుమతితో 26 వారాల గర్భం తొలగింపునుకు చర్యలు తీసుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పిటిషన్పై విచారణను మూసివేశారు.