|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 06:08 PM
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాడు. అయినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో కేసు నమోదు కాగా.. దానికి సంబంధించిన న్యాయ ప్రక్రియ జరుగుతోంది.
ఈ క్రమలోనే ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే తాజాగా పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో లోపాలు ఉన్నాయని పేర్కొన్న నాంపల్లి కోర్టు.. మరోసారి రిటర్న్ పంపించింది. ఇప్పటికే ఓసారి ఛార్జిషీటును వెనక్కి పంపిన కోర్టు.. ఇప్పుడు రెండోసారి కూడా పంపించడం గమనార్హం.
థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని నిర్ధారించిన పోలీసులు.. దానికి సంబంధించి అల్లు అర్జున్తోపాటు ఇంకో 22 మంది పేర్లను ఛార్జిషీటులో పొందుపరిచారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ సరిగా లేదని కోర్టు తెలిపింది. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్డ్రైవ్లను ఆ ఛార్జిషీటుతోపాటు జతపరచలేదని కోర్టు వెల్లడించింది. దీంతో ఆ ఛార్జ్షీట్ను మళ్లీ వెనక్కి పంపిస్తున్నట్లు పేర్కొంది.
పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు భారీగా ప్రేక్షకులు సంధ్య థియేటర్ వద్దకు చేరుకోగా.. అదే సమయంలో సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి రావడంతో.. ఐకాన్ స్టార్ను చూసేందుకు వాళ్లు ఎగబడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాన్స్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కింద పడి అక్కడిక్కడే మృతిచెందారు. ఇక ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. సికింద్రాబాద్ కిమ్స్లో కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అందించగా.. ఆ ఖర్చులన్నీ తామే భరిస్తామని మూవీ టీమ్ హామీ ఇచ్చింది.