|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:33 PM
అమీన్పూర్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తరత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేశామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ మరోమారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా స్థానిక భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఐదు రోజులపాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ. అధికారి యంత్రాంగానికి సంపూర్ణ సహకార అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తహసిల్దార్ వెంకటేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిఐ నరేష్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.