|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:00 PM
ప్రముఖ సినీ నటుడు, గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్కు మరోసారి ప్రాణహాని బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఏకంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రవి కిషన్కు పూజలు నిర్వహించే జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్ ఫోన్కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే.. రామ్గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ విహార్ కాలనీలో నివసించే ప్రవీణ్ శాస్త్రికి నవంబర్ 4న ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి, “ఈసారి మోదీ, యోగి ఇద్దరూ గెలవరు” అని హెచ్చరించడమే కాకుండా, తనను చంపేస్తానని, ఎంపీ రవి కిషన్ను కూడా చూసుకుంటానని బెదిరించినట్లు ప్రవీణ్ శాస్త్రి పోలీసులకు తెలిపారు.ఆ తర్వాత అదే నంబర్ నుంచి తన వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చిందని, అందులో ఎంపీ రవి కిషన్, మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ శుక్లా ఫొటోలపై ‘X’ గుర్తు వేసి ఉందని ఆయన వివరించారు. ఆశ్చర్యకరంగా ఆ వాట్సాప్ నంబర్కు ప్రొఫైల్ పిక్గా లారెన్స్ బిష్ణోయ్ ఫొటో ఉండటం గమనార్హం. గతంలో కూడా రవి కిషన్కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, ఆ కేసులో గోరఖ్పూర్ పోలీసులు ఒకరిని అరెస్టు చేసి జైలుకు పంపారని ప్రవీణ్ శాస్త్రి గుర్తు చేశారు.ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రవి కిషన్ నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నారని, ఆయనకు భద్రత పెంచాలని ప్రవీణ్ శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు.
Latest News