by Suryaa Desk | Sat, Jul 06, 2024, 10:39 PM
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యం కాగా.. ఆగస్టు 15 లోపు ప్రతి రైతును రుణ విముక్తులను చేస్తామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రూ. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు రూ.40 వేల కోట్లు డబ్బులు జమ చేయాల్సి ఉంది. అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను.. ప్రతి నెలా రిజర్వ్ బ్యాంకుకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు ఐదారు వేల కోట్లు రుణ సహాయం పొందుతోంది. ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలకు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచే రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జులై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై దాదాపు రూ.15 వేల కోట్ల నుంచి 18 వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని భావిస్తోందట. టీజీఐఐసీ ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే భూముల తాకట్టుపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది. ఇక రూ. 2 లక్షల రుణమాఫీ అమలుపై ఇంకా విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. జులై రెండో వారం నుంచే రుణమాఫీ ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగినా... ఇప్పట్లో అయ్యేలా కనిపించటం లేదు. ఆగస్టు మెుదటి వారం నుంచి రైతు రుణమాఫీ అమలు చేస్తారని సమాచారం. అందరికీ ఒకేసారి కాకుండా తొలి విడతలో రూ. 50 వేల వరకు రుణాలు తీసుకున్న వారికి ఆ తర్వాత రూ. లక్ష వరకు.. అనంతరం రూ. లక్షన్నర, రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. మెుత్తం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న 40 లక్షల మంది రైతుల్లో 70 శాతం వరకు రైతుల రుణాలు లక్షలోపు ఉంటాయని అంచనా.
ఇదిలా ఉండగా.. రైతు భరోసా పథకం అమలుపైనా ప్రభుత్వం కసరత్తు మెుదలు పెట్టింది. ఈ సీజన్ నుంచి రైతు భరోసా రూ.15 వేలు ( రెండు విడతల్లో) వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా అర్హులను నిర్ధారించటం, ఎన్ని ఎకరాల లోపు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలనే దానిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ వేశారు. అన్ని రాజకీయ, వ్యవసాయ సంఘాలతో ఈ కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.