|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 10:16 AM
మంచు కుటుంబంలో గత కొంతకాలంగా జరుగుతున్న విభేదాల ప్రచారంపై నటి, నిర్మాత మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. తన సోదరులు విష్ణు, మనోజ్ల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్న వారు నాశనమైపోతారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు తమ కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.మనోజ్ నటించిన 'మిరాయ్' సినిమా ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను కత్తిరించి, వక్రీకరించి ప్రచారం చేశారని లక్ష్మి ఆరోపించారు. ఆ ఈవెంట్లో నేను విష్ణు గురించి మాట్లాడకపోయినా అతడిని తిట్టినట్లుగా థంబ్నైల్స్ పెట్టి తప్పుగా చూపించారు. ఒక కుటుంబాన్ని కలపాలనుకుంటున్నారా లేక విడదీయాలనుకుంటున్నారా తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ నాశనం అవుతారు. మీ కర్మ మీరే అనుభవిస్తారు అంటూ ఆమె శాపనార్థాలు పెట్టారు.ఇదే సమయంలో తన కుమార్తె విద్యా నిర్వాణను విష్ణుకు చెందిన స్కూల్ నుంచి ఎందుకు మాన్పించాల్సి వచ్చిందో కూడా లక్ష్మి వివరించారు.నా కూతురు విష్ణు వాళ్ల స్కూల్లోనే చదివేది. కానీ అక్కడ అందరూ తనపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, సేవలు చేయడంతో విలాసవంతమైన జీవితానికి అలవాటవుతోందని గమనించాను. అది తన భవిష్యత్తుకు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ మాన్పించి మరో చిన్న పాఠశాలలో చేర్పించాను. ఈ నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్లు బాధపడినప్పటికీ, నా కూతురి భవిష్యత్తు కోసం తప్పలేదు అని ఆమె స్పష్టం చేశారు.గత కొంతకాలంగా మంచు విష్ణు, మనోజ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు, మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలపై మంచు లక్ష్మి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Latest News