|
|
by Suryaa Desk | Sun, Nov 09, 2025, 08:36 PM
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఆన్లైన్ వేధింపుల కేసు ఊహించని మలుపు తిరిగింది. తనను సోషల్ మీడియాలో అసభ్యకరంగా చిత్రీకరిస్తూ, మానసికంగా వేధిస్తున్నారంటూ అనుపమ ఇటీవల కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. అయితే, ఈ వేధింపుల వెనుక ఉన్నది ఓ అబ్బాయి కాదని, తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తేలడంతో అనుపమతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.కొంతకాలంగా ఓ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి తనపై దుష్ప్రచారం జరుగుతున్నట్టు అనుపమ పరమేశ్వరన్ గుర్తించారు. కేవలం తననే కాకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహనటులను కూడా లక్ష్యంగా చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి పలు ఫేక్ అకౌంట్లు సృష్టించి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించి, కేరళ సైబర్ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో కొద్ది రోజుల్లోనే నిందితురాలిని పట్టుకున్నారు. విచారణలో ఆమె తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని నిర్ధారించారు. ఈ విషయం తెలిసి తాను షాక్కు గురైనట్లు అనుపమ తెలిపారు.ఈ పరిణామంపై స్పందిస్తూ ఆమె వయసు చాలా చిన్నది. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్తి వివరాలు పంచుకోవాలనుకోవడం లేదు. కానీ, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయను. న్యాయపరంగానే ముందుకెళతాను అని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేశారు.
Latest News