|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 11:05 AM
కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నల్లచెరువును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. సభా ప్రాంగణం ఎక్కడ ఏర్పాటు చేయాలి..? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టాళ్లను ఎక్కడ పెట్టాలి అనే అంశాలను ఇతర శాఖల అధికారులతో పరిశీలించారు. ఎంతమంది వస్తారు.. వారికి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశాలను సమీక్షించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒకప్పుడు కూకట్పల్లి నల్ల చెరువు పరిసరాలకు రావాలంటే వెనుకడుగు వేసేవారని.. ఇప్పుడు చెరువు చుట్టూ చక్కర్లు కొడుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ గారు అన్నారు. ఆక్రమణలు తొలగించి 16 ఎకరాలుగా మిగిలిపోతుందనుకున్న చెరువును 30 ఎకరాలకు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని శాలువతో సన్మానించారు. నల్లచెరువు ప్రారంభోత్సవంలో పెద్దయెత్తున స్థానికులు పాల్గొననున్నారని తెలిపారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ్ చౌహాన్ గారు, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి గారు, హైడ్రా డీసీపీ శ్రీకాంత్ గారు, ఏడీసీపీ శ్రీ సుదర్శన్ గారితో పాటు.. పలువురు అధికారులు కూకట్పల్లి నల్లచెరువును సందర్శించిన వారిలో ఉన్నారు.