|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 05:50 PM
‘రాజా చెయ్యివేస్తే’ ఫేమ్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్ బేనర్పై అశోక్వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈనెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. ‘‘కల్యాణ్రామ్తో ఓ మాస్ సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఓ ఆసక్తికరమైన ఐడియా పుట్టింది. వెంటనే ఆ లైన్ను కల్యాణ్రామ్కు చెబితే, ఆయనకు నచ్చింది. కానీ, అందులో తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తేనే ముందుకు వెళ్దామని చెప్పారు. విజయశాంతికి కూడా తన పాత్ర నచ్చడంతో అంగీకరించారు. ఈ సినిమాలో క్టైమాక్స్ కీలకం. ఓ తల్లి కోసం తనయుడు ఏం చేసినా తక్కువే అని చూపించే పతాక సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ‘అమిగో’, ‘డెవిల్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన తర్వాత కల్యాణ్రామ్ చేసిన పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమిది. భావోద్వేగాలు, అద్భుతమైన పోరాట ఘట్టాలు గల ఈ సినిమా మాస్ ఆడియెన్స్తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. కల్యాణ్రామ్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు, సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణ. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు.
Latest News