by Suryaa Desk | Sun, Jul 07, 2024, 03:43 PM
తెలంగాణలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో కొత్త తల నొప్పులు వచ్చిపడ్డాయి. పంట పొలాల్లో సంచరిస్తూ అవి రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణ పేట జిల్లా మాగనూరు, కృష్ణా, నర్వ, దేవరకద్ర, మక్తల్, ఊట్కూరు మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరం వెంబడి దాదాపు మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. ఈ జింకలు రైతులు వేసిన పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కృష్ణ జింకలు మిగతా వన్యప్రాణుల్లా అడవుల్లో సంచరించవు. అవి గడ్డిభూములు, పంటపొలాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటాయి. సమీపంలో రైతులు వేసిన పంటలపై ఆధారపడతాయి. కృష్ణ జింకల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు రాత్రి వేళల్లో పొలాల దగ్గర కాపలా ఉంటున్నారు. అయితే ప్రతి ఏదాడి ఎదురయ్యే ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలను ప్రారంభించింది.
ప్రభావిత మండలాలు, గ్రామాల్లో పంటనష్టంపై కర్ణాటకలోని కోయంబత్తూరుకు చెందిన 'నేచర్ కన్జర్వేషన్ ఎన్జీవో 'సెకాన్'తో అధ్యయనం చేయించి నివేదిక ఇచ్చింది. ఇందులో భాగంగా కృష్ణా మండలం ముడుమాల్లో 74 ఎకరాల్లో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు కృష్ణ జింకలను బంధించి, వాటిని కొన్నాళ్లు పునరావాస కేంద్రంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం దశలవారీగా ప్రాణహిత తీరం, నాగార్జునసాగర్, నల్లమల ఫారెస్ట్లోని మద్దిమడుగు ప్రాంతాల్లో విడిచిపెట్టనున్నారు.
కృష్ణ జింకలను 'బోమా' పద్ధతిలో బంధించనున్నారు. సాధారణంగా ఈ జింకలు 100-150 కలిసి మందలు మందలుగా సంచరిస్తాయి. బోమా పద్ధతిలో ప్రభావిత గ్రామాల్లో దశలవారీగా 'V' అకారంలో 50-80 మీటర్ల పొడవుతో ఫెన్సింగ్ లింక్ ఏర్పాటు చేయనున్నారు. దీని లోపలికి జింకలు వెళ్లే కొద్ది వెడల్పు తగ్గుతుంది. చివరి భాగం నుంచి కృష్ణ జింకలను ఎన్క్లోజర్లో బంధించి తరలిస్తారు. గ్రామాల్లో బంధించిన కృష్ణ జింకలను సంరక్షణ కేంద్రానికి చేరుస్తారు.