by Suryaa Desk | Sun, Jul 07, 2024, 03:45 PM
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దేశంలోనే రద్దీగా ఉండే హైవేలలో ఈ రహదారి ఒకటి. ఈ రహదారిపై ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు పరుగులు పెడుతుంటాయి. అయితే కొన్ని చోట్ల రహదారిపై వేగం తగ్గించుకోవాల్సిన పరిస్థితి. స్థానిక పరిస్థితుల దృష్ట్యా స్పీడ్ లిమిట్ తగ్గుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ రోడ్డు డివైడర్ ఉండటంతో పాటు సమీపంలోనే ఆందోల్ మైసమ్మ ఆలయం ఉంది. దీంతో భక్తులు రోడ్డుకు అటూ ఇటూ వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఇండస్ట్రీయల్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) ప్రతినిధులు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కోరారు. ఈ ప్రాంతంలో రూ.6,675 కోట్ల పెట్టుబడులతో 1500 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.
మెుత్తంగా 45,000 మంది ప్రత్యక్షంగా, 35,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతారని వెల్లడించారు. పార్కు సమీపంలో ఉన్న ఆందోల్ మైసమ్మ గుడి వద్ద ఏర్పడే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రికి విజ్ఞాపన పత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. అటుగా వేళ్లే వాహనాలు వేగం తగ్గించుకునే అవసరం లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.
ఇక హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రహదారి 4 వరసలుగా ఉండగా.. దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ముందుగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద అండర్ పాస్లు నిర్మించి.. ఆ తర్వాత రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోనున్నారు.