by Suryaa Desk | Sat, Jul 06, 2024, 10:31 PM
తెలంగాణలో పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ పథకం పేరుతో పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంత జాగా లేనివారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థక సాయం రూ. 5 లక్షలు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ప్రజాపాలనలో 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల మాదిరిగా కాకుండా.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ఫోకస్ పెట్టారు.
అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు ఎంపిక చేశారు. గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్ను నియమితులు కాగా.. ఆయన ఆధ్వర్యంలోని బృదం ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లి అధ్యయనం చేయనుంది. ఇక ఈ ఏడాది దసరా పండగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలుకు పెద్ద మెుత్తంలో నిధులు పెద్ద అవసరం కాగా.. ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.ఏడున్నర వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది.