![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:59 AM
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే .. చాలా ఏళ్ల తర్వాత పల్లెటూరి అందాల నడుమ ఈ చిత్ర నిర్మాణం చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సీజన్కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండబోదని ఇప్పటికే నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా అదితి రావు హైదరీ నటించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంబో అయిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ మూవీకి పని చేయనున్నారని అంటున్నారు. ఇటీవలే నిర్మాణ సంస్థ సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కు పూజలు చేయించారు. ఇప్పటి వరకూ రంగు రంగుల సెట్టింగ్లు, హైటెక్ హంగులతో చిత్ర నిర్మాణాలు స్టూడియోలలోనే చేయగా, ఇప్పుడు గతంలో మాదిరి పల్లెటూరి అందాల నడుమ చిత్ర నిర్మాణం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఊరికి ఇచ్చిన మాట, పల్లెటూరి మోసగాడు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, అల్లుడా మజాకా, ఆపద్భాంధవుడు, ఇంద్ర, సింహపురి సింహం వంటి మూవీలు చేశారు. ఈ సినిమాలు చిరు అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ మూవీలు కేవలం వినోదమే కాకుండా పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని చక్కగా ఆవిష్కరించి ఆకట్టుకున్నాయి.
Latest News