|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:09 PM
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి, కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఒక వార్డెన్ తన అసమర్థతను ప్రశ్నించినందుకు ఏకంగా విద్యార్థులనే అంతమొందించాలని ఆదేశించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ప్రభుత్వ విద్యాసంస్థల్లోని కొందరు అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలిచింది. సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో గత పది రోజులుగా విద్యుత్ సరఫరా లేక విద్యార్థులు అంధకారంలో మగ్గుతున్నారు. దీనికి తోడు వార్డెన్ కిషన్ నాయక్ నిత్యం మద్యం సేవించి పాఠశాలకు రావడం, విద్యార్థులను నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం పరిపాటిగా మారింది. వార్డెన్ వేధింపులు భరించలేక కనీస సౌకర్యాలు లేక విసిగిపోయిన విద్యార్థులు ఇటీవల రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని, వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమపై అధికారులకు ఫిర్యాదు చేస్తారా? అన్న కోపంతో వార్డెన్ కిషన్ నాయక్ విచక్షణ కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన వంట మనిషికి ఫోన్ చేసి అత్యంత క్రూరంగా మాట్లాడారు. 'నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వంటలో విషం కలిపి అందరినీ చంపేయ్.. పీడ పోతుంది' అంటూ బూతులు తిడుతూ ఆదేశించిన ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తే ఇలా 'విషం పెట్టమని' చెప్పడం చూసి తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ దారుణమైన ఘటనపై నెటిజన్లు, ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం వార్డెన్ కిషన్ నాయక్ ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని నిర్ధారిస్తూ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే వారిని సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం సస్పెన్షన్ మాత్రమే సరిపోదని.. హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం విద్యావ్యవస్థకే సిగ్గుచేటని మండిపడుతున్నారు.
ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మద్యం మత్తులో అరాచకంగా ప్రవర్తించే కిషన్ నాయక్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.