|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:12 PM
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలకు మరోసారి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2015లో నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసులో వీరిద్దరూ కంపెనీ నిధులను పక్కదారి పట్టించినట్లు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ప్రాథమిక ఆధారాలను కనుగొంది. వారి సంస్థ 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' కోసం తీసుకున్న రుణాలను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించి సొంతానికి వాడుకున్నారని ఈవోడబ్ల్యూ వర్గాలు అనుమానిస్తున్నాయి.వ్యాపారవేత్త దీపక్ కొఠారీకి చెందిన ఎన్బీఎఫ్సీ నుంచి 'బెస్ట్ డీల్ టీవీ' కోసం తీసుకున్న నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈవోడబ్ల్యూ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నిధులను సత్యయుగ్ గోల్డ్, వయాన్ ఇండస్ట్రీస్, ఎసెన్షియల్ బల్క్ కమోడిటీస్ వంటి శిల్పా, కుంద్రాలకు సంబంధం ఉన్న ఇతర కంపెనీలకు మళ్లించారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎలా ఖర్చు చేశారు? అనేవి కచ్చితంగా గుర్తించేందుకు థర్డ్-పార్టీ కన్సల్టెంట్ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఈఓడబ్ల్యూ నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రసారాలు, వేర్హౌసింగ్, ఆఫీసు ఖర్చుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి డబ్బును పక్కదారి పట్టించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఈ కేసులో భాగంగా ఈవోడబ్ల్యూ అధికారులు ఇటీవల రాజ్ కుంద్రాను దాదాపు 5 గంటల పాటు విచారించారు. మొదట రూ. 60 కోట్లను అప్పుగా తీసుకున్నప్పటికీ, తర్వాత దానిని ఈక్విటీగా మార్చినట్లు కుంద్రా అధికారులకు తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేశామని, బిపాషా బసు, నేహా ధూపియాలకు బ్రాండ్ ప్రమోషన్ల కోసం చెల్లింపులు జరిపామని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ఆధారాలుగా సమర్పించారు.
Latest News